వ్యవసాయ సాంకేతికతలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలి: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
![](https://telugusupernews.com/wp-content/uploads/2024/02/image-47-860x280.png)
హైదరాబాద్, ఫిబ్రవరి 17, 2024: వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సీఐఐ అగ్రి టెక్ సౌత్ 2024 నాలుగో ఎడిషన్ను, అగ్రి విజన్ 2024 సదస్సును ఆయన ప్రారంభించారు.
ఇలాంటి ఎగ్జిబిషన్లు, సదస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మండలాలు, రైతు వేదికల్లో ఏర్ఆపటుచేసి, రైతుల వద్దకు నేరుగా ఈ పరిజ్ఞానాన్ని తీసుకెళ్లాలని సీఐఐని కోరారు. వ్యవసాయ సాంకేతికత, ఇన్నోవేషన్ల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఏర్పాటుచేసినా కూడా రైతులు ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుని, ఉత్పాదకత పెంచుకోగలినప్పుడే అసలైన సంతృప్తి దక్కుతుందని ఆయన అన్నారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల ఈ సాంకేతికతలు, ఇన్నోవేషన్లు నేరుగా వారికి ప్రయోజనం కలిగేలా ఉండాలని చెప్పారు.
![](https://telugusupernews.com/wp-content/uploads/2024/02/image-47-1024x682.png)
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యవసాయం మీద, రైతుల విషయంలోను బాగా దృష్టి సారించిందని నొక్కిచెప్పారు. జిల్లా వ్యవసాయ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, రైతువేదికల వంటి వివిధ పరిపాలనా స్థాయిల్లో ఆడియో విజువల్ సౌకర్యాల ఏర్పాటుతో పాటు తాము చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా సీఐఐ తెలంగాణ విభాగం రాష్ట్రంలో వ్యవసాయాన్ని విప్లవాత్మకం చేయడంపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఇందులో భాగంగా అగ్రివిజన్ సదస్సులో డిజిటల్ విధానాన్ని విడుదల చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రిమోట్ సెన్సింగ్, రోబోటిక్స్, వివిధ డిజిటల్ టూల్స్ తెలంగాణలో వ్యవసాయాన్ని ఎలా పునర్నిర్మిస్తాయో శ్వేతపత్రం వివరించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకపక్షంగా స్వీకరించడంపై మాత్రమే కాకుండా, స్థిరమైన, ఉత్పాదక, స్థితిస్థాపక వ్యవసాయ వాతావరణాన్ని స్థాపించడానికి దాని సామర్థ్యాలను ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది.
సదస్సులో సీఐఐ తెలంగాణ చైర్మన్, సీఎస్ఆర్ ఎస్టేట్స్ సీఎండీ సి.శేఖర్ రెడ్డి స్వాగతోప న్యాసం చేయగా, అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ (ఎమెరిటస్) డాక్టర్ రోనీ కాఫ్మన్ ఇతర వక్తలు ప్రసంగించారు.
![](http://telugusupernews.com/wp-content/uploads/2024/02/image-47-1024x682.png)
వారిలో ప్రొఫెసర్ గినిగె అతులా, ప్రొఫెసర్ – కంప్యూటింగ్ & ఐసీటీ, వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం; అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ); తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి, తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్రెడ్డి, సీఐఐ అగ్రిటెక్ సౌత్ 2024 స్టీరింగ్ కమిటీ చైర్మన్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు) మాజీ ఉపకులపతి డాక్టర్ వి ప్రవీణ్ రావు; సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ వి. ఈపూర్ తదితరులు ఉన్నారు.